Friday 30 December, 2011

తెలుగు భాషకి పోయే కాలం

'తియ్యని వేడుక చేసుకుందామ'
'ప్రతి ఒక్క ఫ్రెండు అవసరమే రా'
'మీ మాటలు ముగుస్తాయి కాని టాక్ టైము ముగియదు'
'మీ చర్మాన్ని హాని కలిగించే ఐదు లక్షణాలకి వద్దని చెప్పండి'

ఈ తెగులు మన వార్తా పత్రికల్లోనూ, టీవీలోనూ వచ్చే ప్రకటనల్లో వాడే సంకర తెలుగు. యముడితో భూలోకానికి వచ్చిన చిత్రగుప్తుడు పొలీసాయనతో చమత్కరించినట్టు ఇదే మన ఊళ్ళో లేటెష్టు ఫ్యాషన్. స్కూలుకి వెళ్ళే పిల్లలు, టీవీలో యాంకర్లు, సినిమాల్లో హీరోయిన్లు, ‘సువర్చలా’ అంటూ లైవ్ లో వార్తలు చదివే విలేఖరులు ఇలా అందరూ శక్తి వంచన లేకుండా తెలుగు భాషని నాశనం చెయ్యడానికి కృషి చేస్తున్నారు.

‘ఇది క్షాత్ర పరీక్షయే గానీ క్షత్రియ పరీక్ష కాదే’ అంటూ దాన వీర శూర కర్ణ లెవెల్లో తెలుగు మట్లాడటం ఎప్పుడో పోయింది. ణ, ళ, శ లు పొయాయి. పెళ్ళి ని పెల్లి, గణపతిని గనపతి, ఆకాశం ని అకాషం చేసేశారు. తెలుగు అంకెలు ఎలా ఉంటాయో, అసలు ఉంటయో లేదో కూడా ఎవరికీ గుర్తులేదు (ఒక్క రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి తప్ప – తెలుగు అంకెలు చూడాలంటే ఎదైనా ఆర్టీసీ బస్సుని ఫాలో అవ్వండి). ఇక తెలుగు లిపి విషయానికి వస్తే డైనోసార్లూ, డోడో పక్షుల లాగా మన లిపి కూడా త్వరలో అంతరించిపోతుంది. నిద్రలోనైనా చాటింగూ, మెయిల్స్ లో తెలుగుని ఇంగ్లీషులో టక టకా టైపు చేసే ఈ కాలంలో సగం మంది తెలుగు వాళ్ళకి తెలుగు అక్షరాలకీ చైనీసు రాతలకీ పెద్ద తేడా తెలీదు.

తేనెలాంటి తెలుగు భాష ఇలా తయారవ్వటానికి మనందరం బాధ్యులమే. ఆ మధ్య వార్తల్లో చుసా, ఏదో స్కూల్లో ఒక పిల్లాడు తెలుగు మాట్లాడితే చచ్చేట్టు కొట్టాడట టీచరు. ఇక ఆ దెబ్బతో కాస్తో కూస్తో తెలుగు మాట్లాడే వాళ్ళు, మాట్లాడదాం అనుకునే పిల్లలు బెదిరిపోయి వచ్చిన తెలుగు కుడా మర్చిపోయి ఉంటారు.

స్కూళ్ళ దాకా ఎందుకు, ఇళ్ళల్లోనే తెలుగు మాట్లాడటం పాపం అయిపోయింది. వందేళ్ళ క్రితం వచ్చిన ‘కన్యాశుల్కం’లోనే మన గిరీశం పంతులూ తన శిష్యిడూ ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ ష్టార్’ అని ఇంగ్లీషులో సంభాషించుకుంటుంటే ఆ పిల్లాడి ఇంట్లో తెగ మురిసిపోతారు. మరి దాదపు శతాబ్దం తరవాత ఇప్పటి తల్లిదండ్రులు మాత్రం ఎందుకు తగ్గుతారు. ఎవరి పిల్లలు బాగా ఇంగ్లీషు దంచుతారో వాళ్ళే గొప్ప.

మన తెలుగు భాష కల్తీ అవ్వటం వెనుక సినిమా పరిశ్రమ చెయ్యి కుడా ఉంది. హీరొయిన్లు వచ్చీ రానట్టుగా ముద్దు ముద్దుగా తెలుగు మాట్లాడటం బహుశా జీన్సు సినిమాతో మొదలయ్యింది. ఆ సినిమా వచ్చిన కొత్తల్లో మేము ఐశ్వర్య నత్తి డైలాగులు చెప్పుకుని తెగ నవ్వుకునేవాళ్ళం. అప్పుడు కలలో కూడా అనుకోలేదు సుమీ రాను రాను తెలుగు ఎంత చెత్తగా మట్టాడితే అంత స్టయిలు అని, స్వఛ్చంగా తెలుగు మాట్లాడేవాడిని ఎర్ర బస్సు పూర్ ఫెలోగా లెక్కకడతారని. హత విధీ!

ఇక్కడ తెలుగు సాహిత్యం గురించి చెప్పుకోవాలి. కాస్తో కూస్తో పుస్తకాలంటే మోజు ఉన్న నేను గమించింది ఏంటంటే చాలా కాలంగా తెలుగులో కొత్త రచనలు రావటం లేదు (రాంగోపాల్ వర్మ ‘నా ఇష్టం’ పుస్తకాన్ని సాహిత్యం అనటం గుడిలోకి చెప్పులు వేసుకెళ్ళినంత మహా పాపం). ఈ రోజుకీ మా నాన్న బెల్ బాటం, కర్లింగ్సు క్రాఫూ వేసుకుని కలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చిన యండమూరి పుస్తకాలూ, మా అమ్మ చిన్నప్పుడు ఆడవాళ్ళలో విప్లవం తెచ్చిన చలం రచనలూ, మా మామయ్యలో అభ్యుదయ భావాలు కలుగజేసిన వడ్డెర చండీదాస్ నవలలు - ఇవే పుస్తకాలు ప్రచురణలో ఉన్నాయి. అప్పటికీ వంశీ లాంటి యోధులు ‘మా పసలపూడి కథలు’ లాంటి ప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని పునరావిర్భవించటానికి ప్రయత్నిస్తున్నారు కానీ చేతన్ భగత్, అమీష్ త్రిపాటి లాంటి యువ 'రచయితల ' ధాటికి నిలవలేకపోతున్నారు.

ఇవన్నీ చూస్తుంటే కాల మాన పరిస్థుతులు కానీ ఇలాగే కొనసాగితే ఒక వందేళ్ళలో అమెరికాలో ప్రవసాంధ్రుల ఇళ్ళల్లో తప్ప తెలుగు భాష ఎక్కడా వినిపించదేమో అనిపిస్తుంది. ఇక మన తెలుగు భాషని ఆ దేవుడే కాపాడాలి.

3 comments:

tankman said...

అలా అని ' చూపులు కలిసిన శుభలేక ' మూవీ లో గుర్రం గుర్నాథం లాగా "ఓయీ రక్షకభాటా" అంటూ మాట్లాడలేము కదా ....

తెలుగు లో చదవడానికి కొత్త పుస్తకాలు పెద్దగా లేవు ..నేను కూడా ఒప్పుకుంటా ... వీలయితే పోలేరమ్మ బండ కథలు , దర్గామిట్ట కథలు చదువు కదా

Prasanna Dommu said...

నేను అనేదీ అదే Sanju. ఒకప్పుడు గ్రాంధీకం మాట్లాడే వాళ్ళు, ఇప్పుడది వ్యావహారీకం అయ్యింది, త్వరలో ఇంకో రూపం వస్తుంది, ఆ తరవాత మాయం అయిపొతుంది. Evolution....!

దర్గా మిట్ట కథలు రెండేళ్ళ క్రితమే చదివా.... అలాంటి పుస్తకాలు ఇంకా వస్తే బాగుండు అని నా కోరిక...

Indian Minerva said...

"తెలుగు అంకెలు on number plates" concept is at best is an 'appeal to emotion' and at worst involves the financial interests of contractors. I'm afraid I cannot see the anyway other than that.